దేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక తిరోగమనంలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో సంతృప్తికరమైన వృద్ధి రేటును సాధించగలదని హోం శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టిన పి. చిదంబరం చెప్పారు. హేతుబద్ధమైన వృద్ధిరేటును మనం సాధించనున్నామని, ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడుతోందని మంత్రి చెప్పారు.ఆర్థికశాఖ బాధ్యతలను ప్రధానికి అప్పగించి హోమ్ మంత్రిగా నార్త్ బ్లాక్లో మరో విభాగానికి వెళుతున్న కేంద్ర మంత్రి చిదంబరం దేశ ఆర్థిక వ్యవస్థ సంతృప్తికరమైన పెరుగుదల రేటును చవిచూస్తుందని హామీ ఇచ్చారు. భారత్కు సంబంధించినంతవరకు ఆర్థిక తిరోగమనం మాత్రమే జరిగింది తప్పితే మాంద్య పరిస్థితుల్లోకి దేశం కొట్టుకుపోవడం లేదని చిదంబరం గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా దేశం 7నుంచి 8 శాతం దాకా వృద్ధి సాధిస్తుందని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖను ప్రధాని ఇతరులకంటే సమర్థవంతంగా నిర్వహించగలరని కితాబిచ్చారు. గత అయిదు సంవత్సరాల యుపిఎ పాలనను ఎవరైనా వెనక్కు తరిచి చూసినట్లయితే ప్రధాని మన్మోహన్ మార్గదర్శకత్వంలో జరిగిన ఆర్థిక నిర్వహణను అభినందించి తీరుతారని మంత్రి పేర్కొన్నారు. |