ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో పతనమైతే భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రతి ద్రవ్యోల్బణంలోకి పోయే సూచనలు కన్పిస్తున్నాయని బ్యాంకింగ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ ద్రవ్యోల్బణం 9 నెలల కనిష్ట స్థాయిలో 6.61 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇదే పరిస్థితి కొనసాగితే ద్రవ్యోల్బణం సున్నాస్థాయికి చేరుకోవడమే కాకుండా, 2009-10 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి టోకు ధరల సూచీ రెండు శాతానికి చేరుకుంటుందని హెచ్డీఎఫ్సి బ్యాంక్ ట్రెజరీ హెడ్ అశీష్ పార్థ సారథి చెప్పారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం సున్నాస్థాయికి పడిపోతే, రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణానికి మద్దతు ఇవ్వడానికి, ద్రవ్యసరఫరాను మరింతగా చేపట్టడమే కాక వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ద్రవ్యోల్బణం కంటే ప్రతి ద్రవ్యోల్బణం అనేదే ఆర్థిక వ్యవస్థకు మరింత చెరుపు చేస్తుందని ఐడిబిఐ గిల్డ్స్ ఆర్థికవేత్త అమోల్ అగర్వాల్ తెలిపారు. ద్రవ్యోల్బణం స్థానంలో ప్రతి ద్రవ్యోల్బణం అనేది ఏర్పడిందంటే బ్యాంకుల లాభదాయకత తగ్గిపోయే ప్రమాదం తలెత్తుతుందని, దేశీయ రుణ డిమాండుపై కూడా ఇది తన ప్రభావం చూపిస్తుందని సిటీ బ్యాంక్ భారత చీఫ్ ఫైనాన్షియల్ అధికారి అభిజిత్ సేన్ తెలిపారు. |