అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించే అంశాన్ని పరిశీలుస్తున్నామని పెట్రోలియం శాఖ మంత్రి మురళీదేవరా తెలిపారు. బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల దిగువకు చేరడంతో పెట్రోలుపై రూ. 11, డీజిల్పై మూడు రూపాయల వరకూ తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
అయితే దీనిపై ప్రభత్వవర్గాలు స్పష్టం చేయలేదు. కారణం ప్రభుత్వం ఇటీవలే లీటరుపై 5 రూపాయలు, డీజిల్పై రెండు రూపాయలు తగ్గించిన విషయం విదితమే. ఇదిలా ఉండగా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఎన్నికైన హిబీఇడెన్ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న దేవరా ప్రసంగిస్తూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి, కాబట్టి భవిష్యత్తులో పెట్రో ధరలు తగ్గించడానికి అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అయితే తగ్గింపు ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు.
ధరలు తగ్గించే ముందు ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు లీటరు కిరోసిన్పై రూ. 17.26, వంట గ్యాస్పై రూ. 148.38 నష్టాలొస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ధరల తగ్గింపును సమీక్షించాల్సివుంటుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వరంగ చమురు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న కిరోసిన్తో పాటు గ్యాస్పై సంస్థలకు ఒక రోజుకు కిరోసిన్పై రూ. 22 కోట్లు, గ్యాస్పై రూ. 15 కోట్ల నష్టం వాటిల్లుతోందని మంత్రి మురళీదేవరా వివరించారు. ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, కిరోసిన్తోబాటు గ్యాస్లపై ఇప్పటికే రూ. 58 వేల కోట్లు సబ్సిడీ భరిస్తోంది. |