విమాన ప్రయాణీకులకు కొత్త సంవత్సరం శుభవార్తను మోసుకొస్తోంది. ఎందుకంటే దేశీయ విమానయాన సంస్థలు మొత్తంగా విమాన ప్రయాణ ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించాయి. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్వేస్ దేశీయంగా నడిచే అన్ని విమానాల్లో ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను 40 శాతం దాకా తగ్గించింది.ఈ తగ్గింపు ఫలితంగా ముంబై-ఢిల్లీ ఎకానమీ క్లాస్ ప్రాథమిక ధర ప్రస్తుతం 2వేల రూపాయలకు పడిపోయింది. కాగా ముంబై-కోల్కతా బేసిక్ ధర రూ.4.065లలో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కాగా చౌక ధరలతో విమానాలు నడుపుతున్న స్పైస్ జెట్ సైతం ధరలను మరింతగా తగ్గిస్తున్నట్లుగా తెలిపింది. అయితే ఏ మేరకు ధరలు తగ్గిస్తున్నదీ సంస్థ నిర్దిష్టంగా తెలుపలేదు. దేశీయ విమానయానంలో ఛార్జీలను తగ్గిస్తున్నట్లుగా సోమవారం కింగ్ఫిషర్ ఎయిర్వేస్ ప్రకటించడంతో ఇతర విమాన సంస్థలు కూడా ధరల తగ్గింపును ప్రకటించక తప్పింది కాదు. మిగిలిన ఇండిగో, గో ఎయిర్ సంస్థలు ధరల తగ్గింపుపై ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, కింగ్ఫిషర్-కింగ్ఫిషర్ రెడ్, జెట్-జెట్లైఫ్, స్పైస్జెట్ సంస్థలు అన్ని దేశీయ విమాన మార్గాల్లో డిసెంబర్ మొదట్లో ఇంధన సర్ఛార్జీని 400 రూపాయల వరకు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో సహా అన్ని వర్గాలనుంచి తీవ్రఒత్తిడి ఫలితంగా ఎయిర్లైన్ సంస్థలు విమాన ఛార్జీలను తగ్గించవలసి వచ్చింది. విమాన ఇంధన చార్జీలు గత ఆగస్టులో మున్నెన్నడూ లేని విధంగా కిలో లీటరుకు రూ.71,028.26 లకు చేరుకున్న తర్వాత దఫాలుగా ఇంధన ఛార్జీలను తగ్గిస్తూ రావడం తెలిసిందే. |