కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా విదేశీ కార్ల దిగుమతులపై నిషేధాన్ని సడలించింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశీ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఇదివరకు విదేశీ కార్లను దిగుమతి చేసుకోవాలంటే, సదరు కారును ఉత్పత్తి చేసే దేశం నుంచే దిగుమతులు చేసుకునే అకాశంవుండేది.
కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నియమాన్ని సడలించడంతో ఏ దేశం నుంచైనా కూడా కోరుకున్న కారును ఇట్టే దిగుమతి చేసుకోవచ్చు. విదేశీ కార్లపై మోజున్నవారికే కాకుండా కార్లను దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్లో విక్రయించే కంపెనీలకు కూడా ఈ నిర్ణయం ఎంతో లాభదాయకం కాగలదు.
టొయోటా లెక్సస్, మెర్సిడిస్ బెంజ్ కార్ల దిగుమతి ప్రమాణాలను ఇంతకుమునుపే ప్రభుత్వం సడలించింది. కాగా 3000 సిసి కంటే మించిన సామర్థ్యం కలిగిన కార్లు, డీజిల్ 2500 సిసి కార్లను తయారీ చేసే దేశం నుంచే దిగుమతి చేసుకోవాలన్ననియమం వర్తించదని విదేశీ వాణిజ్యం డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలావుండగా ఈ కార్లను కస్టమ్స్ పోర్టులైన కోల్కత్తా, చెన్నై, కొచిన్, ఐసిడి తుగ్లకాబాద్, ముంబై పోర్టులనుంచే దిగుమతి చేసుకోవాల్సివుంటుంది. ఢిల్లీ ఎయిర్ కార్గో పోర్టునుంచి కూడా విదేశీ కార్లను దిగుమతి చేసుకునే సౌలభ్యంవుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో మాలాంటి వ్యాపారస్తులకు ఎంతో మేలు కలుగుతుందని విదేశీ కార్లను దిగుమతి చేసి విక్రయించే వ్యాపారస్తులు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. దీంతో విదేశీ కార్లపై మోజున్నవారికి ఇది సంతోషకరమైన వార్త అని యువకులు అభిప్రాయపడుతున్నారు. |