ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టస్థాయిలో 6.38 శాతానికి పడిపోవడంతో 2009 నూతన సంవత్సరం సానుకూల వైఖరితో మొదలయింది. దీంతో పరిశ్రమను ప్రోత్సహించేందుకోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మరింతగా తగ్గించగలదని పరిశ్రమ వర్గాల్లో ఆశలు పెరిగాయి. డిసెంబర్ 20తో ముగిసిన వారాంతంలో ఆహారపదార్ధాలు, చమురు ధరలు మరింతగా తగ్గి 0,23 శాతం పడిపోవడంతో ద్రవ్యోల్బణం మరింతగా తగ్గిపోయింది. దీంతో వరుసగా 8వ నెలలో కూడా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినట్లయింది. డిసెంబర్ 7న ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ పన్ను తగ్గింపు కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. డిసెంబర్ తొలి వారంలో కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీసెల్ ధరలను తగ్గించడం దవ్యోల్బణంపై అదనపు ప్రభావం కలిగించింది. డిసెంబర్ 20తో ముగిసిన వారాంతంలో టీ, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, దినుసులు, ఉప్పు, వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధన ధరలు మొత్తంమీద 0.5 శాతం పడిపోవడం ద్రవ్యోల్బణంపై మంచి ప్రభావం చూపింది. |