ఆటో, రియాల్టీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో సహా నిర్దిష్ట రంగాలకు సహాయం అందించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనుంది. ఈ అన్ని రంగాల్లోనూ డిమాండును ప్రోత్సహించేందు కోసం డిసెంబర్ 7న కేంద్రం భారీ ప్యాకేజిని ప్రకటించిన విషయం తెలిసిందే.మౌలిక వసతుల కల్పన ఫైనాన్సింగ్ను ముందుకు నెట్టడం కోసం రెండో ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. తొలి ప్యాకేజీ ధరల తగ్గింపుపై దృష్టి పెట్టి వస్తూత్పత్తి రంగంపై ఎక్సైజ్ డ్యూటీని నాలుగు శాతం తగ్గించింది. దీంతో గత నెలలో ఆటో ధరలు, సిమెంట్, ఉక్కు, పలు ఆహార పదార్ధాల ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యుడికి కాస్త ఊపిరి పోసింది. అయితే పన్ను తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి దాదాపు 8 వేల కోట్ల రూపాయల ఆదాయ వనరు తగ్గిపోయింది.మరోవైపున భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేట్లు, ఎస్ఎల్ఆర్ నిష్పత్తులలో కోత విధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో 3 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఇంతేకాక, గృహ నిర్మాణ రంగం తదితర విభాగాల్లో రుణసౌకర్యాన్ని ప్రోత్సహించేందుకోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు రూ11,000 కోట్లను అందచేసింది. గత అక్టోబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి గత 15 ఏళ్లలో మొదటిసారిగా ప్రతికూల పరిస్థితులలోకి దిగజారిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ అవసరముందని గ్రహించింది. అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి 0.4 శాతానికి పడిపోవడం గమనార్హం. పైగా ఎగుమతులు సైతం వరుసగా రెండు నెలలపాటు పతన క్రమాన్ని చవిచూశాయి. నవంబర్ నెలలోనే ఎగుమతుల్లో 9.9 శాతం క్షీణత కనిపించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్యాకేజీకి తోడుగా, జనవరి 27న విధాన సమీక్షలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు సైతం మరింతగా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. |