ఇరు దేశాల మధ్య వ్యూహాత్సక సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో భాగంగా భారత్ అమెరికాతో తన చరిత్రలో అతి పెద్దస్థాయిలో ఆయుధాల ఒప్పందం చేసుకుంది. నౌకాబలగం కోసం 8 బోయింగ్ పి-8 దీర్ఘ శ్రేణి సముద్ర గస్తీ విమానాలను భారత్ అమెరికా నుంచి 2.1 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనడానికిగాను ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలలో ఇదే అతి పెద్దదని వార్తా సమాచారం. భారత్ రక్షణ శాఖ సహాయ కార్యదర్శి ప్రీతి సుదాన్, బోయింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు వివేక్ లాల్ మధ్య జనవరి 1న ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా నావికాబలగం ప్రస్తుతం వినియోగిస్తున్న పి-8ఎ యుధ్ధ విమానాలను మెరుగు పర్చిన రూపమే పి-8 అని సంస్థ పేర్కొంది.
ఈ విమానాలను కొనుగోలు చేయడం ద్వారా భారత నావికాబలగపు సముద్ర గస్తీ సామర్థ్యతలు బాగా పెరుగుతాయని, దాదాపు 600 నాటికల్ మైళ్ల వరకు నావికాబలగం గస్తీ తిరుగవచ్చని నావికా దళాధికారులు తెలిపారు. టార్పెడోలు, డెప్త్ బాంబులు, నౌకా విధ్వంసక క్షిపణులు కూడా ఈ విమానాల్లో ఉంటాయని తెలిపారు. |