కార్పొరేట్ కంపెనీల్లో పారదర్శక పాలనపై అమెరికాకు చెందిన ఓ పబ్లికేషన్ రూపొందించిన జాబితాలో సిటీ గ్రూపు, పెప్సికోలు చోటుదక్కించుకున్నాయి. ఆర్థిక సంక్షోభం తాకిడికి సిటీ గ్రూపు తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వం సాయంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సిటీ గ్రూపుకు విక్రమ్ పండిట్ నేతృత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే కార్పొరేట్ పారదర్శకతలో సిటీ గ్రూపుతో కలిసి అగ్రస్థానంలో నిలిచిన పెప్సికోకు భారత్లో పుట్టిన ఇంద్రా నూయీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్నారు. పండిట్, ఇంద్రా నూయిలు ఇద్దరికీ భారత మూలాలు ఉన్నాయి. పాలన, ఉద్యోగులతో సంబంధాలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అమెరికాకు చెందిన కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ ఆఫీసర్ (సీఆర్వో) 100 బెస్ట్ కార్పొరేట్ సిటిజెన్స్- 2009 (సీఆర్వో పదో వార్షిక నివేదిక)ను తయారు చేసింది.
ఈ 100 కంపెనీల జాబితాలో సిటీ గ్రూపుకు 35వ స్థానం దక్కగా, పెప్సికో 85వ స్థానంలో నిలిచింది. ఫార్మా దిగ్గజం బ్రిస్టల్ మేయర్స్- స్కిబ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆహార పదార్థాల రిటైలర్ జనరల్ మిల్స్, సాంకేతిక రంగ దిగ్గజం ఐబీఎం వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ఏడు విభాగాల్లో అమెరికా కంపెనీల కార్యకలాపాలను పరిగణలోకి తీసుకొని సీఆర్వో ఈ జాబితా తయారు చేసింది. పర్యావరణం, వాతావరణ మార్పులు, మానవ హక్కులు, సంఘసేవ, ఉద్యోగ సంబంధాలు, ఆర్థిక స్థితి, పాలన అంశాలను సీఆర్వో పరిగణలోకి తీసుకుంది. |