21 వ శతాబ్దం భారత దేశానిదేనని, దేశం అన్ని రంగాలలోనూ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంటే, అందులో భారతదేశం యువశక్తిని పెంపొందించుకుంటోందని, దీంతో ఆర్ధికపరంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్(ఐబీఏ) బిజినెస్ లా లో "ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారతదేశం" అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ...ప్రస్తుత దశాబ్దం, అలాగే రానున్న దశాబ్దంలో భారతదేశం యువశక్తిగా ఎదుగుతుందని, అలాగే ప్రపంచంకూడా అభివృద్ధివైపు పయనిస్తోందని ఆయన వివరించారు. కోటిమందికిపైగా జనాభావున్న భారతదేశంలో 19సంవత్సరాల వయస్సులోపువారు 44శాతానికి పైనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. రానున్న ఇరవై సంవత్సరాలలో మన దేశంలో 35 సంవత్సరాలకన్నా తక్కువ వయస్సు కలిగినవారు 40 కోట్లుకుపైగానే ఉంటారని ఆయన వివరించారు. కాగా 60 సంవత్సరాలకు పైబడినవారు కేవలం 10శాతం మాత్రమే ఉంటారని ఆయన జనాభా గణాంకాలతో సహా పేర్కొన్నారు. ఇలా యువత అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో పారిశ్రామికంగాకూడా అభివృద్ధి చెందుతుందని, మన దేశ పారిశ్రామికాభివృద్ధి వలన ఆర్థికమాంద్యంనుంచి గట్టెక్కగలమని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఇతర దేశలకన్నాకూడా పారిశ్రామికంగా భారతదేశం ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలావుండగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారంనాడు రాజస్థాన్లోని రణథంబోర్లో ఓ పులిని చూశారు. రణథంబోర్లోని అటవీ ప్రాంతంలో పులి సంరక్షణాలయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన విహరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారంకూడా మరో మారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. |