దేశంలోని కారుచౌక ప్రైవేట్ విమానయాన సంస్థల్లో అగ్రస్థానంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ తన సంస్థలో పనిచేస్తున్న 110 మందికి ఉద్వాసన పలికింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజునే ఈ చర్య చేపట్టడం గమనార్హం. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ పెరుగుతున్న వ్యయాలు, తగ్గుతున్న ఆదాయం కారణంగా 110 మంది ఉద్యోగులకు ఉద్వాసన సూచికలైన పింక్ స్లిప్లు ఇచ్చినట్టు తెలిపారు.
పింక్ స్లిప్లు అందుకున్న వారిలో 50 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, మిగిలినవారు ప్రొబేషనరీ కాబిన్ సిబ్బందిగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. సంస్థ చేపట్టిన ఈ తొలగింపులు దేశంలోని చట్టాలు, సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే జరిగినట్టు ఆయన తెలిపారు.
వారం రోజుల క్రితం జెట్ ఎయిర్వేస్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 75 వేలకు పైబడి వేతనం అందుకుంటున్నవారి జీతాల్లో 25 శాతం మేర కోత విధించగా తాజాగా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. |