దేశంలోని ద్విచక్రవాహన ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన యమహా మోటార్ లిమిటెడ్ నుంచి మరో కొత్త రకం మోటార్ సైకిల్ మార్కెట్లోకి రానుంది. వచ్చే నెల ఆరో తేదీన ఈ మోడల్ను ఆవిష్కరిస్తామని ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
అలాగే, ఆర్15, ఎఫ్జఢ్-16 బైక్ రకం రేసింగ్ కిట్స్ను కూడా ఈ మోడల్తో పాటే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి తమ డీలర్షిప్ల సంఖ్యను 500 పైగా పెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది.
దీనిపై యమహా మోటార్ లిమిటెడ్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ బ్రాండ్ మేనేజ్మెంట్ డివిజన్ హెడ్ సంజయ్ త్రిపాఠీ మాట్లాడుతూ.. జులై ఆరో తేదీన కొత్త రకం మోడల్ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ రకం మోడల్ గురించి మరిన్ని విషయాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు.
తమ సంస్థకు ఇప్పటికే 400 డీలర్ అవుట్లెట్స్ ఉన్నాయని, వచ్చే డిసెంబరు నాటికి ఈ సంఖ్యను 500 పైచిలుకుకు పెంచుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, యమహా నాణ్యతను, సామర్థ్యాలను అందుకోలేని 40-50 డీలర్స్ను తొలగించనున్నట్టు చెప్పారు. |