దేశీయ మార్కెట్లో బంగారం అమ్మకాలు మరింతపెరిగే అవకాశాలున్నాయని, దిగుమతులుకూడా పెరిగే సూచనలున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో నగల తయారీ పరిశ్రమలో కూడా స్థిరత్వం వచ్చిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత కొద్ది నెలలుగా బంగారం ధరలు పెరిగిపోవడంతో బంగారం అమ్మకాలలో తగ్గుదల కనపడింది. దీంతో మార్కెట్లో బంగారం ధరలు గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉండటంతో అమ్మకాలు పెరిగే అవకాశాలున్నట్లు ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. గత కొద్ది రోజులుగా పది గ్రాముల బంగారం ధర రూ.14,500 నుంచి రూ.15000 మధ్య ఊగిసలాడుతోంది కాని తగ్గడం లేదు. ధరలు స్థిరంగా ఉన్నందు వల్ల జూలై మాసం నాటికి పసుపు ధాతువైన బంగారుకు డిమాండు పుంజుకోవడమే కాకుండా దిగుమతులు కూడా పెరిగే అవకాశాలున్నాయని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజిసి) డైరెక్టర్ ధర్మేష్ సోధా తెలిపారు.ఇదిలావుండగా కొనుగోలుదారులు కూడా ధరలు పెరగడం వల్ల తగ్గే వరకు వేచిచూస్తుండగా, ఈ ఏడాది మొదటి వివాహ సీజన్ను పూర్తవడం బంగారానికి డిమాండు క్షీణించడానికి కారణమని, పెరిగే సూచనలు లేవని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్(ఎన్సిడిఈఎక్స్) ఆర్థికవేత్త మానసీ ఎస్.గోఖలే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పసుపు ధాతువు(బంగారం) డిమాండు తగ్గడం వల్ల దేశంలో బంగారం, వెండి దిగుమతులపై తీవ్రమైన ప్రభావం పడింది. బంగారం దిగుమతులు 2008వ సంవత్సరంలో 450 టన్నులు ఉండగా ప్రస్తుతం 45 శాతానికి క్షీణించిందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అదే 2009 ఏప్రిల్లో మాత్రమే బంగారం దిగుమతులు పెరుగాయని, ఇప్పటి వరకు 32 టన్నుల బంగారం మాత్రమే దేశంలో దిగుమతి అయ్యిందని డబ్ల్యూజిసి తెలిపింది. |