దేశంలోనే అతి పెద్దదైన బీమా కంపెనీ భారతీయ జీవిత బీమా నిగమ్(ఎల్ఐసీ) తన శాఖలలోని ఏ శాఖలోనైనా పాలసీదారుడు తన పాలసీని సరెండర్ చేసి డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనుంది. రానున్న రెండు సంవత్సరాలలో తన శాఖలకు చెందిన రెండువేల వంద శాఖలలో ఏ శాఖలోనైనా ఎల్ఐసీ పాలసీదారుడు తన పాలసీ ప్రీమియం కట్టే ముగింపు కాలం పూర్తయిన వెంటనే ఆ కాపీని సరెండర్ చేసి డబ్బులను డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఎల్ఐసీ ఛైర్మెన్ టీ.ఎస్. విజయన్ తెలిపారు. దేశంలోని తమ శాఖలన్నింటిలోనూ కంప్యూటరీకరణ చేశామని, దీంతో రానున్న రెండు సంవత్సరాలనుంచి తమ పాలసీదారుడు తన పాలసీ కాలపరిమితి ముగిసిన వెంటనే తనకు రావలసిన డబ్బులను తీసుకునేందుకు సంబంధిత శాఖలోనే వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదని, దీనికిగాను పాలసీదారుడు ఎక్కడ నివసిస్తుంటే అక్కడకు దగ్గరలోని తమ శాఖలో ఆ పాలసీ బాండ్ను సమర్పించి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పాలసీదారుడు తనవద్దనున్న దస్తావేజులను తమ ఏ శాఖలోనైనా సమర్పిస్తే వెంటనే సంబంధిత పాలసీదారునికి డబ్బులు అందుతాయని, దీనికి ఇంటర్నెట్ సౌకర్యాలను మరింత మెరుగు పరుస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమశాఖలలో ఎంటర్ప్రైస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈడీఎమ్ఎస్) ప్రోజెక్ట్పై విస్తారంగా పనులు జరుగుతున్నాయని, ఇది 2011వ సంవత్సరాంతానికి పూర్తవుతుందని ఆయన అన్నారు. దీంతో పాలసీదారునికి తన సొమ్మును ఏ శాఖలోనుంచైనా తీసుకునే వెసలుబాటు తమ సంస్థ కల్పిస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టును తాము 2007వ సంవత్సరంలో ప్రారంభించామని, ఇందులో భాగంగా తమ సంస్థకు సాఫ్ట్వేర్ కంపెనీ అయిన హెవ్లెట్ పేకార్డ్(హెచ్పీ) సంస్థ తమ సంస్థకు సహాయ సహకారాలందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎల్ఐసీ దేశవ్యాప్తంగానున్న తన శాఖలలోని తమ ఖాతాదారులందరికీకూడా సులభమైన తరహాలో డబ్బులు అందుకునేలా చర్యలను ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ శాఖలో దేశవ్యాప్తంగా 23 కోట్లమంది ప్రజలు పాలసీదారులుగా ఉన్నారని, తమవద్దనున్న అన్ని రకాల దస్తావేజులను కంప్యూటరీకరణ చేస్తామని, దీంతో భవిష్యత్తులో ఎలాంటి విపత్తు సంభవించినాకూడా తమ ఖాతాదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. |