నిధుల లేమితో బాధపడుతున్న ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదుకోనుంది. ఆర్థిక సంక్షోభంనుంచి బయటపడేందుకు అవసరమైన మద్దతు ఇస్తామని ప్రధాని మన్మోహన్ చెప్పారు. అయితే సంస్థ పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, ఖర్చులను మరింతగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించినట్లు పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఎయిర్ ఇండియా ఆర్థిక సంక్షోభంనుంచి బయటపడేసేందుకు తాత్కాలిక ఆర్థిక సహాయం కొరకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి ముందు కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చించారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను ఎయిర్ ఇండియా నెలరోజుల్లోగా క్యాబినేట్ కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీకి సమర్పించాల్సి ఉంటుందని పటేల్ తెలిపారు. ఎయిర్ ఇండియా సంస్థ జాతికే గర్వకారణమని, ఈ సంస్థను ఆదుకోవడానికి ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఆయన అన్నారు. ఇందుకోసం ఎయిర్ ఇండియాకూడా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని, ఉద్యోగులు ఆర్థిక సమస్య తీవ్రతను గుర్తించి వ్యవహరించాలని ఆయన సూచించారు. సంస్థాగతంగాను, ఆర్థికంగాను, మానవ వనరుల పరంగానూ ఎయిర్ ఇండియా పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దిశగా సంస్థ గట్టి చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వ సాయం కొనసాగడం కష్టతరమౌతుందని ఆయన అన్నారు. |