నందన్ నీలేకణి ఇన్ఫోసిస్ సంస్థకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీయే స్వయంగా తెలిపింది.
ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ప్రముఖులైన ఎన్.ఆర్.నారాయణమూర్తితోపాటు నీలేకణికూడా ఒకరు. ప్రస్తుతం ఈయన సహాధ్యక్షునిహోదాలో అక్కడ పనిచేస్తున్నారు.
ఇదిలావుండగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కి అధ్యక్షునిగా బాధ్యతలను నిర్వర్తించమని నందన్ నీలేకణిని కోరడంతో ఆయన ఇన్ఫోసిస్కు రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సంస్థ బోర్డు సభ్యులు ఆయన రాజీనామాను గురువారం ఆమోదించారు. ఈ రాజీనామా జులై 9వ తేదీనుంచి అమలుకానుంది.
యూఐడీఏఐ అధ్యక్ష పదవి కేబినెట్ మంత్రి హోదా కలిగిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇన్ఫోసిస్ సంస్థ ప్రారంభంనుంచి ఆయన అక్కడ పనిచేస్తున్నారు. మేనెల 2002వ సంవత్సరంనుంచి జూన్ 2007వ సంవత్సరం వరకు ఆయన ప్రధాన డైరెక్టర్గా ఆ సంస్థలో బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత కంపెనీకి చెందిన బోర్డులో సహాధ్యక్షుని హోదాలో నియమించింది.
ఈ సందర్భంగా ఆ కంపెనీ చీఫ్ మెంటర్ మరియు అధ్యక్షుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ... నందన్ లాంటి ఉద్ధండులకు భారతదేశ చరిత్రను తిరగరాసే అవకాశం వచ్చినందులకు తమకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఓ బృహత్తరమైన కార్యక్రమాన్ని నేరవేర్చేందుకు నందన్ సేవలు దేశానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. |