ఆర్థిక సంక్షోభంతో వచ్చిన కష్టాలను అధిగమించేందు కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఒక స్వచ్ఛంద శెలవు పథకం అమలు చేసేందుకు రూపకల్పన చేసింది. ఈ పథకం కింద సంస్థలోని శాశ్వత (పర్మినెంట్) ఉద్యోగులు రెండు నుండి ఐదేళ్ల పాటు వేతనాలు లేని శెలవు తీసుకోవలసిందిగా ప్రతిపాదించింది. రెండు లేదా ఐదేళ్లు విరామంలో మరే ఇతర విమానయాన సంస్థల్లోనైనా పనిచేయవచ్చని తెలిపింది. శెలవు తీసుకున్న ఉద్యోగులు ఈ విరామం తర్వాత గతంలో ఎయిర్ ఇండియా సంస్థలో నిర్వర్తించిన బాధ్యతలను తిరిగి స్వీకరించవచ్చని వివరించింది.ఈ పథకానికి సంబంధించి నిన్న ఎయిర్ ఇండియా ఓ నోటీసును విడుదల చేసింది. కాగా, ఎయిర్ ఇండియా ప్రకటించిన ఈ పథకం కింద ఉద్యోగులు తీసుకున్న శెలవు కాలానికి వేతనంతో పాటు కరువు భత్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, పింఛను, గ్యాట్యుటీ వంటివి ఉండవు. కానీ, మెడికల్ అలవెన్స్, విమాన ప్రయాణ సదుపాయాలను మాత్రం శెలవు తీసుకున్న ఉద్యోగులు యథావిదిగా పొందవచ్చు.ఒక వైపు కేంద్రం.. ఎయిర్ ఇండియాకు సాయం చేస్తామని చెప్పినప్పటికీ.. పునర్వ్యవస్థీకరణకు కఠినమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. దీంతో మరో దారి లేక ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదలా ఉంచితే ఎయిర్ ఇండియా సమస్యలను అధ్యయనం చేసేందు కోసం యాజమాన్యం, యూనియన్లతో 9 జాయింట్ కమిటీలు ఏర్పాటవగా.. సంస్థ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు ఎయిర్ ఇండియా మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.కాగా, ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 30వేలకు పైగా పర్మినెంట్ ఉద్యోగులు, 20వేల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి చెల్లించే వార్షిక వేతనాలు బిల్లు.. రూ. 2,500 కోట్లు ఉండగా.. ఇందులో కనీసం రూ. 500 కోట్ల వరకైనా తగ్గించుకునేందుకు ఎయిర్ ఇండియా చూస్తున్నట్లు తెలిసింది. |