అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలను ప్రభుత్వం ఇంకొంత కాలం పరిశీలిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. పెట్రోలియం ధరల పెంపు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకునే ముందు, ప్రభుత్వం ఇంకొంత కాలం అంతర్జాతీయ ముడిచమురు ధరలను పరిశీలిస్తుందన్నారు.
దురదృష్టవశాత్తూ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. తాజా పరిణామాలను ప్రభుత్వం గమనిస్తోందని మురళీ డియోరా పేర్కొన్నారు. ధరల్లో స్థిరత్వం కోసం ప్రభుత్వం ఇంకొంత కాలం వేచిచూస్తుందని తెలిపారు. ఇంధన ధరల పెంపు కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడతారని కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వానికి తెలుసన్నారు.
అందువలనే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గగానే దేశంలోనూ తమ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించిందన్నారు. మళ్లీ ఇప్పుడు ధరలు పెరిగిన కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచే ముందు కేంద్ర మంత్రివర్గం ముడిచమురు ధరలను పరిశీలిస్తుందని తెలిపారు. |