దేశవ్యాప్తంగా రానున్న ఆర్థిక సంవత్సరంనుంచి వస్తువులు మరియు సేవలపై పన్ను(జీఎస్టీ)ను విధించాలని గతంలో కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కాని ఈ పన్ను విధించే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేసింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిరశన వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం నూతన ప్రణాళికలను రూపొందించనుంది.
దేశంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడుతోసహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని అమలు చేసేందుకు నిరాకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి అమలు చేయాల్సిన జీఎస్టీని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖామంత్రులతో సంప్రదించి వారితో చర్చించిన మీదటే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసకుంటామని అధికారులు వెల్లడించారు.
కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నూతన నిర్ణయం దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండేలా ఓ కొత్త ప్రణాళిక అని, కాని ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో పలు రకాలుగా పన్నులు వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. జీఎస్టీ పన్ను విధానం అమలైతే వ్యాట్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తదితరాలు దీనికిందికి వచ్చే అవకాశాలున్నాయి.
పలు రాష్ట్రాలు జీఎస్టీని వ్యతిరేకించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగష్టునాటికి కొత్త ప్రణాళికను రూపొందించి ఆర్థికమంత్రులతో చర్చించేందుకు సన్నాహాలను మొదలుపెట్టింది. కాని ఈ ప్రణాళికలను రూపొందించడంలో కాస్త ఆలస్యం జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రణాళికలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎర్న్స్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పజెప్పింది. ఆగష్టునాటికి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని నియమాలు రూపొందించాల్సి ఉంది. కాని ఇంకాస్త సమయం తీసుకునేలా ఉందని ఆ సంస్థకు చెందిన పార్ట్నర్ సత్య పొద్దార్ అన్నారు. దీనికి ఇంకా నాలుగు నెలల కాలం పట్టనుందని ఆయన తెలిపారు.
దీనినిబట్టి చూస్తే దేశంవ్యాప్తంగా అమలయ్యే జీఎస్టీ పన్ను రానున్న ఆర్థిక సంవత్సరం ప్రారంభంనుంచి అమలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. |