లోక్సభలో రైల్వేశాఖామంత్రి మమత బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చాలా బాగుందని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. రైల్వేల ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు, సమస్యల పరిష్కారంపైన దృషి పెట్టారని ఆయన ఈ సందర్భంగా మమతా బెనర్జీని ప్రశంసించారు. రైల్వే బడ్జెట్ సామన్యుడి ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్ ప్రశంసించారు. ఇది పేదల అనుకూల బడ్జెట్ అని ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, సాధారణ పౌరుల కోసం ఈ బడ్జెట్ రూపొందిందని హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా ప్రస్తుతించారు. ప్రస్తుతం మమత దీదీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆకర్షణీయంగా ఉందని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో దేశంలో మరిన్ని సంస్కరణలకు అవకాశం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. |