జెట్ ఎయిర్వేస్ పైలెట్లు చేస్తున్న సమ్మె బుధవారం రెండవరోజుకు చేరుకుంది. సుమారు 150కి పైగా దేశీయ, విదేశీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. 400 మందికి పైగా పైలెట్లు విధులకు హాజరు కాలేదు. దీంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
పైలెట్లు విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరించింది. సమ్మె ఇలా కొనసాగుతుండగానే జెట్ చీఫ్ నరేష్ గోయల్ పౌరవిమానయానమంత్రి ప్రఫుల్పటేల్ను కలుసుకుని పరిస్థితిని వివరించారు. సుమారు గంట సేపు జరిగిన సంభాషణలలో చివరకు ఏం చర్చించారన్న విషయంపై విలేకరులు ప్రశ్నించినా పటేల్ సమాధానమివ్వకపోవడం గమనార్హం.
ఆందోళనను విరమింప జేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పటేల్ గోయల్కు చెప్పినట్లు సమాచారం. బుధవారంనాడు పైలెట్లు తమ సమ్మెను కొనసాగించడంతో 19 అంతర్జాతీయ సర్వీసులతో పాటు మొత్తం 153 సర్వీసులు రద్దైనాయి.
ఇదిలావుండగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకు దాదాపు 1056 మంది పైలట్లు ఉండగా వీరిలో 432 మంది ఈ రోజుర తమ విధులకు హాజరు కాలేదని కంపెనీ ప్రతినిధి ఒకరు ముంబైలో వెల్లడించారు.
కాగా మొత్తం పైలెట్లలో విదేశాల నుంచి రప్పించిన వారి సంఖ్య 160గా ఉంది. సంస్థకు చెందిన నిబంధనల ప్రకారం పైలెట్లు విధులకు హాజరు కాకపోతే వారందరని తొలగించాల్సి ఉంటుందని అంతకు ముందు గోయల్ హెచ్చరించారు. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ను తాము గుర్తించటం లేదని ఆయన చెప్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పైలెట్లు చేస్తున్న సమ్మెకు ఈ సంఘం నేతృత్వం వహిస్తోంది.ఈ యూనియన్లో దాదాపు 680 మంది సభ్యులున్నారు. సంస్థ తొలగించిన పైలెట్లను తిరిగి నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయపు సర్వీసులు చాలావరకు రద్దయ్యాయి. యుకె, అమెరికా,సింగపూర్ యూరప్లకు వెళ్లేవాటిని ఈ సమ్మెనుంచి మినహాయించినట్లు సమాచారం.
FILE
ఇదిలావుండగా జెట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన పైలెట్లు చేస్తున్న సమ్మెకు ఎన్యూఎస్ఐ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్.జి. సారంగ్ మాట్లాడుతూ... సమస్యను జెట్ ఎయిర్వేస్ సంస్థ పరిష్కరించకపోతే తాము ప్రపంచవ్యాప్తంగా విమానాలను స్థంభింపజేస్తామని ఆయన తెలిపారు.
కాగా జెట్ పైలెట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ను కలవాలనుకున్నారని పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. వీరు ఇలాగే సమ్మెను కొనసాగిస్తుంటే పైలెట్లపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని మంత్రిత్వశాఖ ప్రకటించింది.
దీంతో జెట్ చీఫ్ నరేష్ పైలెట్లతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నారని, కాని వారు సమ్మెను విరమిస్తేనే తాను వారితో చర్చలకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపినట్లు జెట్ సంస్థ తెలిపింది.