ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఏఐకి వరంగా మారిన జెట్ పైలెట్ల సమ్మె (Air India | Jet Airways | Strike | Civil Aviation Company | Passengers)
జెట్ ఎయిర్వేస్ పైలెట్ల దేశవ్యాప్త సమ్మె మాంద్యంతో అతలాకుతలమౌతున్న ఎయిర్ ఇండియా సంస్థకు వరంగా మారింది.
జెట్ పైలెట్లు ఆకస్మిక సెలవుపై వెళ్ళడంతో ఆ సంస్థకు చెందిన విమానాలను మూడు రోజులుగా నిలిపివేయడంతో ఇప్పటి వరకు ఖాళీగా తిరుగాడుతున్న తమ విమానాల్లో రద్దీ ఓ మోస్తరుగా పెరిగిందని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. దీంతో తమకు మంచి ఆదాయం లభిస్తోందని వారు తెలిపారు.
జెట్ విమానాలు రద్దు కావడంతో తమ సంస్థకు చెందిన విమానాలలో ప్రయాణించిన ప్రయాణీకులు ఒక్క రోజులో పది వేలకు చేరుకున్నారన్నారు. బుధవారంనాడు మరో అదృష్టం తమ తలుపు తట్టిందని... అది భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తమ క్రికెట్ టీంను శ్రీలంకకు పంపేందుకు ఎయిర్ ఇండియాను సంప్రదించిందని దీంతో తమ సంస్థకు మరింత ఊరట కలిగించే అంశమని అధికారులు అన్నారు. తమ సంస్థ వెంటనే వారికి ఓ ప్రత్యేకమైన విమానాన్ని ఏర్పాటు చేసామని, దీంతో జెట్ ఎయిర్వేస్ సంస్థ చూస్తూ మిన్నకుండిందని వారు తెలిపారు.
చాలా కాలం తర్వాత తమ సంస్థకు చెందిన విమానాలు ప్రయాణీకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించాయని, దీంతో తమ సంస్థలోని ఉద్యోగులకు చేతినిండా పని దొరికిందని అధికార వర్గాలు తెలిపాయి.