దేశీయ టెలికాం రంగంలో అగ్రగామిగానున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ దేశంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశంలోని తన జీఎస్ఎమ్ వినియోగదారులకు పండుగ సందర్భంగా ఎస్టీడీ ప్రతి నిమిషానికి కేవలం 39 పైసలే వసూలు చేస్తుంది.
తాము వినియోగదారుల కోసం ప్రత్యేకంగా పండుగ సీజన్లో ప్రవేశపెట్టిన ఎస్టీడీ వోచర్ను మార్కెట్లో విడుదల చేసామని కంపెనీ తెలిపింది. తాము మార్కెట్లో విడుదల చేసిన ప్రత్యేక వోచర్ను ఉపయోగించి ప్రతి నిమిషానికి ఎస్టీడీ 39 పైసలు చెల్లించి ఉపయోగించుకోవచ్చని ఆర్కామ్ అధికారులు తెలిపారు. ఈ సేవలు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే ప్రవేశ పెట్టామని వారు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక వోచర్ కాల పరిమితి కేవలం ఒక్క నెల మాత్రమే ఉంటుందని, ఢిల్లీలోని 18 వేల ఔట్లెట్లలో లభిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో తమ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని, పండుగ సీజన్లో అందరితో సంప్రదింపులు జరుపుకోవచ్చని, మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.