ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తులు దాదాపు 1 కోటి టన్నుల మేర తగ్గనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాని ఇంతకంటే ఎక్కువగానే తగ్గవచ్చని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తులు తగ్గుముఖం పట్టనుండటంతో కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి 20 నుంచి 50 లక్షల టన్నుల బియ్యం దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. దీంతో ట్రేడర్లపై విధించే నాన్ ప్రీమియం బ్రాండ్పై విధించే దిగుమతి సుంకాన్ని దాదాపు 70 శాతం మేరకు తగ్గించాలని భావిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వరి ఉత్పత్తులలో తగ్గుముఖం పట్టే సూచనలుండటంతో బియ్యం రిటైల్ మార్కెట్పై తీవ్రమైన ప్రభావం పడనుంది. దీంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని వ్యవసాయ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే బియ్యం ధరల్లో 14 శాతం పెరిగాయి.
నిరుడు 9.9 కోట్ల టన్నుల వరి ఉత్పత్తులు జరిగాయని, అదే ప్రస్తుత ఏడాదిలో 8.9 కోట్ల టన్నులకు చేరుకుని ఒక కోటి టన్నుల వరి ఉత్పత్తులు తగ్గుముఖం పడుతుందని వరి ఎగుమతి దారులు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ లోటును గోధుమల సరఫరాతో పూడ్చగలదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
వరి ఉత్పత్తులు తగ్గుముఖంపట్టే సూచనలు కనపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కనీసం 20 నుంచి 50 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోక తప్పదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలావుండగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద గోధుమలు 2.85 కోట్ల టన్నులు, 1.6 కోట్ల టన్నుల బియ్యం నిల్వవుందని వ్యవసాయాధికారులు తెలిపారు.