దేశంలోని ఐటీ సేవలను అందించడంలో అగ్రగామిగానున్న హెచ్సీఎల్ ఈ నెల నుంచే తమ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు పెంచనుంది.
ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం బారినుంచి బయట పడుతుండటంతో అక్టోబర్ ఒకటి నుంచే తమ సంస్థలోని ఉద్యోగులకు జీతాలలో దాదాపు పది శాతం పెంచనున్నామని, దీంతో తమ లాభంలో 1.30 శాతం తగ్గుముఖం పడుతుందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రధాన కార్యనిర్వహణాధికారి వినీత్ నాయర్ బుధవారం వెల్లడించారు.
దీంతో వచ్చే రెండు త్రైమాసికాలలో కంపెనీకి సకల మార్జిన్లపై 1.30 శాతం తగ్గుదల కనపడుతుందని, ప్రస్తుతం కంపెనీ మార్జిన్ 19 శాతంవద్ద ఉందని ఆయన పేర్కొన్నారు.
2009 సెప్టెంబర్, 30 వరకు తమ సంస్థలో మొత్తం 54,443 మంది ఉద్యోగులున్నారని, అదే గత త్రైమాసికాంతానికి తమ సంస్థలో కొత్తగా 665 మందిని నియమించుకున్నామని ఆయన తెలిపారు.