రాష్ట్రానికి చెందిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ఆంధ్రాబ్యాంకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ తైమాసికంలో నికరలాభంలో గత ఏడాది ఇదే సమయానికంటే 70 శాతం వృద్ధి సాధించిందని, కిందటి ఏడాది త్రైమాసికంలో 162 కోట్ల రూ.లుగా ఉన్న నికరలాభం ఈసారి 274 కోట్లకు చేరుకుందని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి.
తమ బ్యాంక్ వ్యాపార లావాదేవీలు కూడా 27 శాతం పైకెగసి 1,10,460 కోట్ల రూ.లకు చేరింది. బ్యాంకు నిర్వహణా లాభం 63 శాతం పెరిగి 453 కోట్ల రూ.లుగా నమోదైంది. స్థూల రుణాలు 32 శాతం పెరుగుదలతో 48,182 కోట్లకు, మొత్తం డిపాజిట్లు 23 శాతం వృద్ధితో 62,279 కోట్లకు చేరాయని బ్యాంక్ తెలిపింది.
అలాగే బ్యాంకు మొత్తం ఆదాయం 23 శాతం వృద్ధి చెందగా, మొత్తం వ్యయం 14 శాతానికి పరిమితం అయిందని, బ్యాంక్కున్న ఆస్తుల మీద ఆదాయం గత ఏడాది కంటే 1.53 శాతం పెరిగిందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం 1.12 శాతంగా ఉండిందని బ్యాంక్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది.