దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న ఐసీఐసీఐ బ్యాంక్ తన సంస్థలోని ఉద్యోగులకు బోనస్ ఇవ్వనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి వచ్చిన నికర ఆదాయం వృద్ధి జరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సంస్థలోని ఉద్యోగులకు బోనస్ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందా కోచర్ వెల్లడించారు.
నిరుడు ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండటం మూలాన తమ ఉద్యోగులకు బోనస్ ఇవ్వలేకపోయామని, కాని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బోనస్ చెల్లిస్తామని ఆమె అన్నారు.
ప్రస్తుతం తమ సంస్థలో దేశవ్యాప్తంగా 36,000 మంది సిబ్బంది ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఆమె తెలిపారు.
ఇదే ఏడాదిలో మరో 580 కోత్త శాఖలను ప్రారంభించనున్నామని, దీంతో మరిన్ని ఉద్యోగావకాశాలు తాము కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదిలావుండగా సెప్టెంబర్ 2009తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలు 2.6 శాతం పెరిగి రూ. 1,014 కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన నికర లాభాలతో పోలిస్తే రెండు శాతం పెరిగింది.