ద్రవ్యోల్బణం పెరుగుతోందని.. ఆందోళనపడాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం యథావిధిగా ఉద్దీపనలను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే దాకా.. ఈ ఉద్దీపనలు ఆపే ప్రసక్తే లేదని ప్రణబ్ తెలిపారు. మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ గరిష్ఠంగా 500 పాయింట్లకు పైగా నష్టపోయిన నేపథ్యంలో.. ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీలో ఎకనమిక్ ఎడిటర్స్ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ, ద్రవ్య లభ్యతకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ఆర్థిక వృద్ధి రేటులో మనం ఇప్పుడు ముందుకే దూసుకెళ్తున్నామన్నారు. ఈ ఏడాదిలో వరుసగా.. జూన్, జూలైలలో 8.2 శాతం, 7.2 శాతంగా ఆర్థిక వృద్ధి రేటు నమోదైందని తెలిపారు.
అయితే ఆగస్టులో ఏకంగా 10.2 శాతానికి చేరుకుందన్నారు. ప్రత్యేకించి గత ఐదు నెలల కాలంలో.. విదేశీ నిధులు భారత్కు వచ్చాయన్నారు. విదేశీ నిధులపై తాము ఎలాంటి నిబంధనలు విధించలేదని.. సరఫరా వంటి అంశాల్లో తలెత్తుతున్న సమస్యల వల్లే.. నిత్యావసర, ఆహార వస్తువుల ధరల్లో పెరుగుదలకు కారణమవుతున్నట్లు వివరించారు.