కంప్యూటర్ సామ్రాజ్యానికి రారాజు అనిపించుకున్న "సత్యం" రామలింగరాజు జైల్లో ల్యాప్టాప్ ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాంతీయ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు వడ్లమాని శ్రీనివాస్ కూడా తనకు ఓ ల్యాప్టాప్ కావాలని అభ్యర్థన చేసుకున్నాడు.
ల్యాప్టాప్ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లయితే తమను తాము కాపాడుకునేందుకు అది ఎంతగానో ఉయోగపడుతుందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. తమపై పలు రకాల అభియోగాలు మోపినందున వాటన్నిటికీ తగు రీతిన జవాబు చెప్పాలంటే తమకు ల్యాప్టాప్ అవసరం తప్పనిసరి అని రామలింగరాజు, శ్రీనివాస్ తమ అభ్యర్థనలో పేర్కొన్నారు.
కాగా ఇప్పటివరకూ సత్యం కంపెనీ కుంభకోణం విషయంలో సీబీఐ దర్యాప్తు చేసిన వివరాలు రెండు సీడీల్లో కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ నెల 16 తేదీన కోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది.