సంచలనాలకు మారుపేరైన టాటా సంస్థ ఇప్పుడు టెలికాం రంగంలోను తన సత్తా చాటుకుంటోంది. సెకనుకు పైసా లెక్కన చెల్లించండంటూ దేశంలోని వినియోగదారులను ఆకట్టుకోవడంలో సఫలమైన డొకొమో, ఇప్పుడు రోమింగ్లోనూ సెకనుకు పైసా చెల్లంచమని సంచలనం రేకెత్తించింది.
టెలికాం చార్జీల్లో సెకనుకు పైసా చెల్లించాలని సరికొత్త విప్లవానికి నాంది పలికిన టాటా డొకొమో సంస్థ ఇప్పుడు తాజాగా సెకనుకు పైసా విధానాన్ని రోమింగ్ సేవలకు కూడా విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు దీపక్ గులాటీ తెలిపారు.
భారతదేశంలోని ఏ నెట్వర్క్కైనా లోకల్, ఎస్టీడీలకు చేసే అన్ని రోమింగ్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్కు ప్రతి సెకనుకు పైసా విధానాన్ని సోమవారం అంటే 23.11. 09 నుంచి అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
మొబైల్ ఫోన్లకే కాకుండా ల్యాండ్లైన్ ఫోన్లకు చేసే కాల్స్కు ప్రతి సెకనుకు పైసా చార్జీ వర్తిస్తుందని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ రోమింగ్ టారీఫ్ ప్లాన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు వినియోగదారుడు రోమింగ్లోనున్నప్పుడు ప్రతి నిమిషానికి అదనంగా 50-60 పైసల చొప్పున రుసుము వసూలు చేస్తున్నారని, తాము వినియోగదారునికి అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు.
రోమింగ్లోను ప్రతి సెకనుకు పైసా పథకం ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు వర్తింపజేస్తామని ఆయన అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా తమ వినియోగదారులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం కాని, ప్రత్యేక ప్యాక్ తీసుకోవాల్సిన అవసరం కాని లేదని ఆయన వివరించారు.