దేశంలో అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో 1 కోటి 66 లక్షల 70 వేల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్లను తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొబైల్ వాడేవారి సంఖ్య 48 కోట్ల 84 లక్షలకు చేరుకుంది.
ట్రాయ్ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అక్టోబర్ నెలలో జిఎస్ఎమ్, సిడిఎమ్ఏ, ఎఫ్డబ్ల్యూపికి చెందిన కనెక్షన్లను మొత్తం 1 కోటి 66 లక్షల 70 వేల మంది తీసుకున్నారు.
ఇందులో టాటా టెలీ సర్వీసెస్ వినియోగదారులు 38.7 లక్షలు, వోడాఫోన్ వినియోగదారులు 29.8 లక్షలు, భారతీ ఎయిర్టెల్ వినియోగదారులు 27 లక్షలు, రిలయన్స్ వినియోగదారులు 21 లక్షలు, ఎయిర్సెల్ వినియోగదారులు 20.02 లక్షలు, ఐడియా సెల్యులార్ వినియోగదారులు 19 లక్షలుగా ఉన్నారని ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది.
అలాగే అక్టోబర్ నెలలో బిఎస్ఎన్ఎల్ సంస్థకు 6.8 లక్షల మంది వినియోగదారులు కొత్తగా చేరారని, అదే ఎమ్టిఎన్ఎల్ వినియోగదారులు 58210 మంది కొత్తగా కనెక్షన్లను తీసుకున్నారని నివేదిక తెలిపింది.
గడచిన అక్టోబర్ 31 నాటికి దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 52 కోట్ల 56 లక్షల 50 వేలకు చేరుకుంది. అదే సెప్టెంబర్ నెలకు టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 50 కోట్ల 90 లక్షల 30 వేలుగా ఉండింది. దీంతో కేవలం ఒక నెలలోనే 3.26 శాతం వినియోగదారులు పెరిగారని ట్రాయ్ వెల్లడించింది.