త్వరలో రేషన్ బియ్యం ధరను రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని భావిస్తోంది. కిలో బియ్యం రెండు రూపాయల పథకానికి స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ఖజానా నుంచి భారీ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తోంది. ఈ భారాన్ని మోయడం ప్రభుత్వానికి కష్ట సాధ్యంగా మారింది.
అందువల్ల కిలో బియ్యం ఆరు రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై పునరాలోచన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా కిలో రెండు రూపాయల బియ్యం పథకం కింద సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నులను సరఫరా చేస్తోంది. ఎఫ్.సి.ఐ.నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కిలో బియ్యాన్ని 16.50 రూపాయలకు కొనుగోలు చేసి, దాన్ని రెండు రూపాయల చొప్పున రేషన్ షాపుల ద్వారా విక్రయిస్తోంది.
అంటే ఒక కిలో దగ్గర 14.50 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. ఈ భారం కోట్ల రూపాయల్లో ఉంది. ప్రస్తుతం ఈ భారాన్ని భరించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని అందువల్ల రేషన్ బియ్యాన్ని ఆరు రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.