సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్న సేవలను అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు కేంద్ర ఐటీ, సమాచార శాఖామంత్రి సచిన్ పైలట్ తెలిపారు. దీనిపై ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో ప్రధాన తపాలా కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాల్లో మెరుపువేగంతో అభివృద్ధి చేసేందుకు నిధుల కొరత లేదన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మంత్రులు పర్యటన చేపట్టనున్నట్టు తెలిపారు. తాను కూడా రేపటి నుంచి సరిహద్దు గ్రామాలను సందర్శించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా, అత్యుత్తమ పోస్టల్, మొబైల్ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే నాణ్యవంతమైన ఈ మనీ, ఈ పేమెంట్ తదితర సౌకర్యాలను గ్రామీణ ప్రాంత వాసులకు కూడా అందిస్తామన్నారు. ఇందుకోసం పోస్టాఫీసులను ఆధునకీకరించనున్నట్టు చెప్పారు.