ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ద్రవ్యోల్బణం ఏప్రిల్ నుంచి తగ్గుతుంది: కౌశిక్ బసు (Kaushik Basu | RBI | May-June | Inflation | Chief economic advisor | Kaushik Basu)
ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం పెరిగి దరిదాపు రెండంకెలకు చేరుకుంది. అయినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది.
వచ్చే నెలలోను ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలోనే ఉంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు సోమవారం న్యూ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.
సోమవారం కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం సూచీని విడుదల చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ... గతంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 9.89 శాతానికి చేరుకుందన్నారు. ఇది 16 నెలలపైకి చేరుకుందన్నారు. అక్టోబరు 2008 నుంచి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీంతో ద్రవ్యోల్బణం రేటు వృద్ధి చెంది ఫిబ్రవరి నెలలో 9.89 శాతానికి చేరుకుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయన్నారు.
ఆహార సూచీ ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో స్థిరంగా ఉందని, దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా మే-జూన్ నెలల్లో మరింతగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా ప్రస్తుత మార్చి నెలలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేకపోతే ద్రవ్యోల్బణం మరింతగా తగ్గే సూచనలున్నాయని ఆయన అన్నారు.