దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరం(2010-11)లో దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మరో వెయ్యి శాఖలను ప్రారంభించనుంది.
తమ బ్యాంక్ దేశవ్యాప్తంగానున్న గ్రామాలు, చిన్న పట్టణాలలో వెయ్యి శాఖలను ప్రారంభిస్తున్నామని, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమౌతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జేకే సిన్హా న్యూ ఢిల్లీలో వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు దేశవ్యాప్తంగా ఆరువందల శాఖలను గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో ప్రారంభించిందని ఆయన తెలిపారు. దీంతోపాటు రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి శాఖలను ప్రారంభించేందుకు తమ బ్యాంకు ప్రణాళికలు రూపొందించుకుందని ఆయన తెలిపారు. దీంతో దేశంలోని 8,000 ప్రాంతాలకు తమ బ్యాంకు సేవలను విస్తరించినట్లౌతుందని ఆయన అన్నారు.
ఇందులో భాగంగా ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు గాను 24,000 స్మార్ట్ కార్డ్లను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే స్వచ్ఛంద బ్యాంకు ఖాతాలను కూడా గ్రామీణ, చిన్న పట్టణాలలోని ప్రజల ద్వారా ప్రారంభింపజేసినట్లు ఆయన తెలిపారు.