ప్రారంభించిన ఆరు మాసాలలోనే జీఎస్ఎమ్ సేవలను అందించడంలో ముందంజలో ఉన్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రకటించింది. కార్యకలాపాలను నిర్వహించడంలో బీఎస్ఎన్ఎల్ సమర్థతతో వ్యవహరించడంలేదంటూ వస్తున్న ఆరోపణలను కంపెనీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కుల్దీప్ గోయల్ మీడియా ఎదుట తోసిపుచ్చారు.
జీఎస్ఎమ్ సేవలను అందించడంలో ముందుండటమే ఇందుకు నిదర్శనమని గోయల్ తెలిపారు. ఇతర ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్లు ఇప్పటివరకు అడుగుపెట్టడానికి సాహసించని గ్రామీణ భారతంలో బీఎస్ఎన్ఎల్ పూర్తి స్థాయి సేవలను అందిస్తున్నదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా టెలికాం విభాగానికి (డీవోటీ) చెందిన సాంకేతిక నిపుణులు అందించిన నివేదికను కేంద్రప్రభుత్వం ఆమోదించడంతో అదనపు స్పెక్ట్రమ్ పొందడంలో వోడాఫోన్ మరియు ఎయిర్టెల్ తదితర ఆపరేటర్లకు విఘాతం ఏర్పడింది. డీవోటీ నిపుణుల ప్రతిపాదనలతో దేశంలోని జీఎస్ఎమ్ పరిశ్రమ నిరాశలో మునిగిపోయింది.
అదనపు స్పెక్ట్రమ్ కోరుకునే ఆపరేటర్లు అత్యధిక సంఖ్యలో ఖాతాదారులను కలిగి ఉండాలని డీవోటీ తీర్మానించడం ఆపరేటర్లకు శరాఘాతంగా మారింది.
|