రైలు బండ్ల రాక పోకలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించేందుకు శాటిలైట్ ఇమేజింగ్ ఫర్ రైల్వే నావిగేషన్ (సిమ్రన్) పైలెట్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను ఉపయోగించుకుని ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.
లక్నోకు చెందిన రీసెర్చి డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ మరియు కాన్పూర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు సంయుక్తంగా సిమ్రన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాయి. రియల్ టైమ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అందించే క్రమంలో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అభివృద్ధికై పైలెట్ ప్రాజెక్టు మంజూరు చేయబడినట్లు అధికారి వెల్లడించారు.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్ళతో పాటు లక్నో నుంచి కాన్పూర్ మధ్య నడిచే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎమ్యూ)లో ఫీల్డ్ ట్రయల్ చేపడతామని తెలిపారు.
|