చైనాకు చెందిన వక్సీ నగర ఛీఫ్ ఎగ్జ్క్యూటివ్ యాంగ్ వీజ్ నుంచి భారత ఐటీ మరియు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆహ్వానం అందింది. నగరంలోని కంపెనీలతో పాటు భారత్కు చెందిన ఐటీ కంపెనీలు కూడా ఆవుట్సోర్సింగ్ సేవలను కల్పించడంలో సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో తాము ఆహ్వానిస్తున్నట్లు వీజ్ తెలిపారు.
బెంగుళూరులో మంగళవారం సర్వీస్ అవుట్సోర్సింగ్ కో-ఆపరేషన్ ఎజెండాపై జరిగిన వక్సీ-బెంగుళూరు వాణిజ్య సదస్సులో పాల్గొన్న వీజ్ మాట్లాడుతూ తమ నగరం ప్రత్యేకాంశాలతో ఆధిక్యత కలిగి ఉందని వెల్లడించారు. విస్తృతమైన మార్కెట్ల సముదాయం, రానున్న కాలంలో అభివృద్ధి గల అవుట్సోర్సింగ్ సేవల విభాగ పరిశ్రమలో నగరం మూలస్థంభం కాగలదని ధీమా వ్యక్తం చేశారు.
రానున్న రెండేళ్లలో ఇరవై ఉన్నత స్థాయి అవుట్సోర్సింగ్ సేవలకు సంబంధించి పార్కులను నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భారత ఐటీ కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని.. ఇందులో 10 సంస్థల ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు వివరించారు. కాగా, ఒప్పందాలు చేసుకోనున్న ఐటీ సంస్థల్లో ఎన్ఐఐటీ కూడా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
|