దేశంలో ఉన్న మొబైల్ ఆపరేటర్ పోటీదారులతో మౌళిక సదుపాయాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ మొబైల్ సేవా రంగ సంస్థ భారతి ఎయిర్ టెల్ ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన ఆంటెన్నాలు, ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, ఫీడర్ కేబుల్స్ తదితరమైనవన్నింటిలోను భాగస్వమ్యం కల్పించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
న్యూఢిల్లీలో గురువారం ఏఐఎంఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరుల సమావేశంలో భారతి గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ అండ్ సీఈఓ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ కొత్త కంపెనీలతోనైనా.. తమ సంస్థకు చెందిన మౌళిక సదుపాయాలను పంచుకునేందుకు సిద్ధమని తెలిపారు.
గత ఏడాదిలో భారత టెలికాం నియంత్రణా మండలి (ట్రాయ్) సిఫార్సు ప్రకారం తామీ నిర్ణయం తీసుకున్నామని మిట్టల్ వివరించారు. టెలికాం విభాగం ద్వారా ఈ సిఫార్సు అంగీకారం పొందినట్లైతే కంపెనీల ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయని... తద్వారా టారిఫ్ ధరలను కూడా తిరోగమించే అవకాశం రాగలదని ఆయన పేర్కొన్నారు.
60 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న తమ సంస్థ 2010 కల్లా సుమారు 100 నుంచి 125 మిలియన్ల వినియోగదారులను లక్ష్యంగా ఎంచుకున్నట్లు వ్యాఖ్యానించారు. కాగా, ప్రపంచంలోనే మొదటి పదిస్థానాల్లో ఉన్న కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి.
|