టెలికాం కంపెనీలపై అదనపు స్పెక్ట్రమ్కు ఛార్జీలు పెంచటంతో పాటు ఒకేసారి చెల్లించే విధంగా కొంత లెవీని వెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నందున, త్వరలోనే టెలిఫోన్ కాల్ ఛార్జీలను పెంచక తప్పదని సెల్యూలార్ ఆపరేటర్లు చెబుతున్నారు. దీంతో చాలా కాలం తరువాత టెలిఫోన్ టారిఫ్లు పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి.ఈ విషయమై సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ డి.జి. రామచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే అతితక్కువ కాల్ రేట్లను వసూలు చేస్తున్నామని, పోటీ పెరగడంతో లాభాల మార్జిన్స్పై ఒత్తిడి పెరుగుతోందని, ఈ సమయంలో స్పెక్ట్రం ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచన చేస్తే... టారిఫ్ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.ఇలాంటి పరిస్థితుల్లో... టెలికాం సర్వీసులను నిర్వహించేందుకు వాహకంగా ఉండే స్పెక్ట్రమ్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం ఆలోచించటం భావ్యం కాదని రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే... 3జీ స్పెక్ట్రమ్ విషయమై చర్చించేందుకు టెలికాం శాఖా మంత్రి ఎ.రాజా ప్రధానితో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి చిదంబరం కూడా పాల్గొన్నట్లు టెలికాం వర్గాలు వెల్లడించాయి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |