ఈ ఏడాది సంయుక్త అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించాలని భారత్, జపాన్లు ప్రణాళికలు చేశాయి. పూర్తి గురుత్వాకర్షణ లేని స్థితిలో పెరిగే మొక్కలపై ప్రయోగాలు చేసేందుకు ఈ సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ పరిశోధకులు వెల్లడించారు.ఆసియాలోనే రెండు పెద్ద శక్తులైన భారత్, జపాన్లు ఈ ఏడాది అక్టోబర్లో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. భారత్లో తయారుకాబడిన ఈ మానవరహిత ఉపగ్రహం.. జపాన్ లేబరేటరీకి చెందిన పరికరాలను మోసుకెళుతుంది. భూమి నుండి 600కి.మీల ఎత్తులో ఒక వారం రోజుల పాటు కక్ష్యలో తిరిగేలా దీని ప్రయోగిస్తారు.ఆల్గే జాతి మొక్కలు అంతరిక్షంలో ఎలా జీవిస్తాయో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేయనున్నట్లు జపాన్ అంతరిక్ష కేంద్రం జాక్సా ప్రొఫెసర్ నొరియాకీ ఇషివోకా వెల్లడించారు. ఈయన అంతరిక్షంలో పత్రహరితముల ద్వారా సూర్యశక్తిని ఉపయోగించి నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ను కలిపి కార్బోహైడ్రేట్లుగా తయారు చేసే ప్రక్రియ (ఫొటోసింథసిస్)పై అధ్యయనం చేస్తున్నారు.ఎలాంటి గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఫొటోసింథసిస్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేస్తున్నామని నోరియాకీ తెలిపారు. ఈ ప్రాథమిక ప్రయోగం ద్వారా అంతరిక్ష వ్యవసాయానికి మార్గం ఏర్పడే అవకాశం ఉందన్నారు. |