2009 ఆర్థిక సంవత్సరంలో ఐటీ మరియు ఐటీ ఎనేబుల్డ్ సేవల పరిశ్రమ 10.8 శాతం మేరకు వృద్ధి చెందనున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదేళ్లలో నమోదైన వృద్ధి కన్నా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేయనున్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం నెమ్మదించనున్నదని అధ్యయన సంస్థ ఐడీసీ ఇండియా తెలిపింది. ఐడీసీ వివరాల ప్రకారం.. ప్రస్తుతం భారత్లో ఐటీ వృద్ధి తగ్గుముఖం పట్టినప్పటికీ... రానున్న నాలుగేళ్లలో 110 బిలియన్ డాలర్ల ఆదాయంతో 13.9 శాతం మేరకు లాభపడగలదని తెలిపింది.
ఐడీసీ ఇండియా మేనేజర్ కపిల్ దేవ్ సింగ్ మాట్లాడుతూ, 2008లో భారత ఐటీ పరిశ్రమ మొత్తం 57 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. భారత ఐటీ రంగంపై ఆర్థిక సంక్షోభ ప్రభావం తప్పక ఉంటుందన్నారు. ఏదేమైనప్పటికీ, 2013 కల్లా ఐటీ పరిశ్రమ 11.4 శాతం వృద్ధి చెందగలదని అంచనా వేస్తన్నట్లు వివరించారు.
దేశీయ ఐటీ మరియు ఐటీ-ఎనేబుల్డ్ సేవల పరిశ్రమకు.. 2008లో రూ. 99,254 కోట్లు లాభం రాగా... 2013లో ఇది రూ. 2,06,398 కోట్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. |