ఈ నెల 25వ తేదీన బాంబు పేలుళ్ళు జరుగుతాయంటూ పోలీస్ డైరక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయానికి ఈ నెల 21వ తేదీన అందిన లేఖ బూటకమైనదిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి జంటనగరాలలో జరుగనున్న గణేశుని విగ్రహాల నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది.
నిమజ్జనం సందర్భంగా చేపట్టవలసిన రక్షణ చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు అదనపు బలగాల ఆవశ్యకత తదితర అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సమావేశం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీజీపీ కార్యాలయం అందుకున్న లేఖలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ లేఖ వెనుక సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
|