ముఖ్యమంత్రి పదవిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిని లోకాయుక్త పరిధిలోకి తెచ్చేందుకు వైఎస్, బాబు సుముఖత తెలియజేస్తున్నారో? లేదో? అనే అంశాన్ని తేల్చి చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ప్రజానాయకులైన రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఆస్తులపై పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాసనసభలో చర్చలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనికోసం వెంటనే శాసనసభ సమావేశం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాబు, వైఎస్ల పరస్పర ఆరోపణల్లోని నిజనిజాలు బయట పడితే ప్రజలకు మేలు కలిగే ఆస్కారం ఉందని నారాయణ అన్నారు.
దీనితో పాటు నన్నపనేని రాజకుమారిపై మహిళా కాంగ్రెస్ నేతలు దాడి చేయటాన్ని నారాయణ తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శనలు చేసే అధికారం ఉన్నా ఆరోపణలు చేసే వారిపై దాడులు జరపడం సముచితం కాదని ఆయన సూచించారు.
|