దేశ సమైక్యత, సమగ్రతకు పోలీసుల సేవలు ఎనలేనిదని రాష్ట్ర హోంశాఖ మంత్రి జానారెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో గోషా మహాల్లో జరిగిన పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జానారెడ్డి ఉగ్రవాద చర్యల్లో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ.... ఉగ్రవాద చర్యలు, అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని, ప్రతి ఏడాది పోలీసుల మరణం తటస్థించకూడదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ బాసిత్ మాట్లాడుతూ... ఉగ్రవాద అవాంఛనీయ సంఘటనల్లో గత ఏడాది 26 మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ఈ ఏడాది 9మంది ఉగ్రవాద చర్యలకు ప్రాణాలను విడిచారని చెప్పారు. అయినప్పటికీ దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తమ కర్తవ్యాన్ని క్రమంగా నిర్వర్తించాలని ఆయన పోలీసులకు పిలుపు నిచ్చారు.
|