హిందువులు పరమపవిత్రంగా పూజించే గోవులను సంరక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సన్నద్ధమయ్యింది. చెన్నైకు చెందిన శ్రీ భాష్యకర ఛారిటబుల్ ట్రస్ట్ హిందూ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్న గోవును కాపాడేందుకు నడుం బిగించింది.
ఇందులో భాగంగా గోమాతపై రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సును డిసెంబర్ ఒకటి నుంచి నిర్వహించాలని తితిదే పాలకమండలి తీర్మానించింది. గోవుల పరిరక్షణకు ఉద్దేశించిన ప్రణాళికను రూపొందించడమే కాక ఆధ్యాత్మికంగా, సామాజికంగా, శాస్త్రీయంగా మరియు ఆర్థిక కోణంలో గోవుకు గల ప్రాధాన్యతను తెలియజెప్పే లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. ప్రముఖ వెటర్నరీ వైద్య నిపుణులు, స్వయంసహాయక బృందాలు, వ్యాసకర్తలు, రైతులతో పాటు 'గోశాలలు', 'పంచకావ్య కేంద్రాల' ప్రతినిధులు సదస్సులో పాల్గొని తమ అధ్యయన పత్రాలను సమర్పిస్తారు.
|