సోమవారం వాడివేడిగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే వరికి గిట్టుబాటు ధరపై విపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాలను స్పీకర్ కె. సురేష్ రెడ్డి తిరస్కరించడంతో పాటు పీఏసీ పెడదామని సూచించారు.
అయితే వరికి మద్దతు ధర చర్చకు తర్వాతే ఏ చర్చనైనా చేపట్టాలని తెదేపా, తెరాస పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో స్పీకర్ సభను పావుగంట వాయిదా వేశారు. పావుగంట తర్వాత సమావేశమైన సభలో తిరిగి విపక్షాలు అదే అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాయి.
అంతేకాకుండా విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని డిమాండ్ను కొనసాగించాయి. దీనితో తిరిగి సభ అరగంట పాటు వాయిదా పడింది. అరగంట తర్వాత తిరిగి సభ సమావేశమైనా అదే పరిస్థితి కొనసాగడంతో.... అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఇలా చేయడం తగదని, సభను సుముఖంగా నడిపించాలని స్పీకర్ విపక్షాలను కోరారు. అయితే స్పీకర్ సూచనలను ప్రతిపక్ష నేతలు పట్టించుకోక పోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
|