ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చేతిలోని ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కీ ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) మరోమారు ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అన్నది కాంగ్రెస్ సారథ్యం, హయాంలోనే జరిగితీరాలని ఆయన ఉద్ఘాటించారు. అయితే.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలకు విరుద్ధగా నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మరో మారు కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపాయి.
శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ 'నో 'అనిన మరుక్షణమే పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా వున్నట్టు కాకా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నట్టు కాకా తెలిపారు. ఇదిలావుండగా.. మరో సీనియర్ నేత, ఎంపీ హరిరామ జోగయ్య కూడా ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇద్దరు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|