రాష్ట్రంలోని రైతులకు కూడా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసే విషయంపై ప్రయత్నాలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ఆయన శనివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని రైతులపై హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలో నష్టాల ఊబిలో కూరుకున్న నాలుగు కోట్ల రైతులను ఆదుకునేందుకు ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేసిన వైఎస్సార్, రైతులకు కూడా పావలా వడ్డీ రుణాల పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని, అందులోభాగంగా అలీంసాగర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామని చెప్పారు.
అలాగే నిజామాబాద్లోని 23 మండలాల్లో 3,85,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 2,500 కోట్ల రూపాయలతో గోదావరి నుంచి ఒక భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రకటించారు.
|