ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ మహేష్ చంద్ర లఢ్హా బుధవారం వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ.. ఒక నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేశారు.
గుంటూరు మిర్చి యార్డులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ చేసే మిర్చి పంట బుగ్గిపాలైన విషయం తెల్సిందే. అయితే ఈ ప్రమాదం వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మార్కెట్ స్థలాన్ని స్వాహా చేసేందుకు ముఖ్యమంత్రి, మార్కెట్ యార్డు ఛైర్మన్లు కుట్ర పన్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ జరిపి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. ఇదిలావుండగా అగ్ని ప్రమాదంలో పంటను కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేయనున్నారు.
|